ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : చిన్నారుల చేతిలో మొబైల్ కాదు.. పుస్తకం ఉండాలని, విజ్ఞానానికి విత్తనం గ్రంథ పఠనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వారానికి ఒక రోజు విద్యాసంస్థలన్నింటిలోనూ ఒక ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసేలా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమం - హైదరాబాద్ నుండి అమరావతికి పుస్తకంతో బస్సుయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడలోని, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బస్సు యాత్ర చేరుకుంది. ఆ బస్సుయాత్రకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్వాగతం పలికారు. బస్సుయాత్ర చేస్తున్న పుస్తక ప్రేమికుల్ని, రచయితల్ని, ఉద్యమకారుల్ని ఆత్మీయంగా పలకరించారు. బస్సుయాత్ర విశేషాలను ఉద్యమ సారథి మంచికంటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో పెరిగిపోయిన మొబైల్ కల్చర్ ను తగ్గించాలంటే బుక్ రీడింగ్ ఒక్కటే మార్గమన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు బాగా పెంచాలన్నారు. వాళ్ళను గ్రంథాలయాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఉద్యమిస్తున్న మరో గ్రంథాలయ ఉద్యమ నాయకులందర్నీ అభినందించారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలోనూ విద్యాలయాల్లో వారానికి ఒక్కరోజు పాఠ్యాంశేతర పుస్తకాలను చదివే విధంగా ఒక సెషన్ ఏర్పాటు చేసేలా ఉపాధ్యాయుల్ని ప్రోత్సహిస్తామన్నారు. అవకాశమున్న పార్కుల్లో మినీ మొబైల్ గ్రంథాలయాల ఏర్పాటు గురించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా 'జయహో పుస్తకం' పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, సీనియర్ జర్నలిస్టు యేమినేని వెంకటరమణ సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో మంచికంటి, బండారు విజయ, కాసుల రవికుమార్, సీఏ ప్రసాద్, కాంతి నల్లూరి, పైడిమర్రి విజయ, కందుకూరు రాము, కస్తూరి ప్రభాకర్, కాసుల శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News