ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన, నైపుణ్య వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని అన్నారు. మహిళామణులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిశ్రమలు, డీఆర్డీఏ తదితర శాఖలతో పాటు కూలెక్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని, గుంటుపల్లిలో ఉన్న రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ సెంటర్ (రైజ్)లో ప్రత్యేక జాగృతి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం కలిగిన కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమానులు సూక్ష్మ, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, చిన్నస్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలా శిక్షణ అందించారు. ఫ్రయర్స్, పిజ్జా ఓవెన్స్, శాండ్విచ్గ్రిల్స్, వాఫెల్ మెషీన్స్, ఎలక్ట్రికల్ గ్రైడర్స్ తదితరాలపై లైవ్ డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం చాలా లాభదాయకమని.. అయితే ఉత్పత్తులను అత్యంత పరిశుభ్రతతో నాణ్యతతో అందించినప్పుడే వినియోగదారుల ఆదరణ ఉంటుందన్నారు. అందుకే ఇలాంటి అధునాతన, వినూత్న మెషీన్లు ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం పాటు వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చన్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కలను సాకారం చేసేందుకు ప్రతివారం రైజ్ కేంద్రంలో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తున్నామని.. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకొని స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. *రైజ్.. హెల్పింగ్ హ్యాండ్:* మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తే కుటుంబం, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభ, ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు రైజ్ వంటి వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ రైజ్ కేంద్రంలో వరుసగా ఇది నాలుగో వర్క్షాప్ అని.. ఇలాంటి మరిన్ని వర్క్షాప్లు నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. పాఠాలు నేర్చుకోవాలంటే బడికి వెళ్లాలి.. దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లాలి.. పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే రైజ్ కేంద్రానికి వెళ్లాలంటూ మహిళామణుల్లో స్ఫూర్తి నింపారు. మంచి ఆలోచనలు ఆదాయ మార్గాలుగా మారేలా రైజ్ చేయిపట్టి నడిపిస్తుందని, ఆర్థిక సాధికారతను సొంతం చేస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. *పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:* మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న పీఎంఈజీపీ వంటి పథకాలతో పాటు వివిధ రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్ మద్దతు పథకాలపై జిల్లా పారిశ్రామిక అధికారి వివరించారు. బ్యాంకు రుణాల ప్రక్రియ, డాక్యుమెంటేషన్, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక మద్దతు పొందే విధానం వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు యూనిట్ స్థాపనలో ఎదురయ్యే సమస్యలు, వినూత్న పరికరాల వినియోగం, నిర్వహణ, ముడి సరుకు అందుబాటు, మార్కెటింగ్ సవాళ్లు వంటి అంశాలపై నిపుణులతో చర్చించారు. ప్రత్యక్షంగా తమ సందేహాలకు సమాధానాలు పొందడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంతమంది మహిళలు త్వరలోనే ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ప్రారంభించేందుకు ఆసక్తి వ్యక్తం చేయడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఈ వర్క్షాప్ విజయానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, కూలెక్స్ ఇండస్ట్రీస్ యాజమానులు పాలకుర్తి రాధాకృష్ణ, భ్రమరాంబ, సందేశ్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల, ఔత్సాహిక మహిళలు హాజరయ్యారు.
Admin
E Nivas News