ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చూసి పథకం ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా జల, పారిశుద్ధ్య మిషన్ (డీడబ్ల్యూఎస్ఎం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జల్ జీవన్ మిషన్ - కుళాయి కనెక్షన్లలో పురోగతితో పాటు పథకం పనితీరుపై సమీక్షించారు. అదేవిధంగా స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)- ఓడీఎఫ్ ప్లస్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరులో మండలంలోని సీకేడీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి కనెక్షన్ల భౌతిక స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. 100 శాతం కనెక్షన్లు కల్పించేందుకు డీపీవోకు ఆదేశాలిచ్చారు. గొల్లమండల తండా, జమలగడ్డ, దీప్లానగర్ ఆవాసాలకు అవసరమైన క్లియర్ వాటర్ సంప్ నిర్మాణం పూర్తిచేసి మార్చి నాటికి తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి కొరత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నిరంతర నాణ్యమైన తాగునీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. షెడ్యూల్ ప్రకారం చేతి పంపులు, బోర్వెల్స్ మరమ్మతులు, పైపులైన్ల లీకేజీల నివారణ, కలుషిత నివారణ వంటి వాటి పనులు జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా & శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో తాగునీటి సరఫరా వ్యవస్థలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాల సాధనలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కూడా కీలక అంశమని.. ఈ నేపథ్యంలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను పకడ్బందీగా అమలుచేయాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్ట కాలపరిమితుల్లో నీటి వనరుల శాంపిళ్లను పరీక్షించి, ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పీహెచ్, టీడీఎస్, హార్డ్నెస్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్ వంటి వాటితో పాటు భౌతిక, రసాయన, బ్యాక్టీరియాలజికల్ పరామితులపై దృష్టిసారించాలన్నారు. క్లోరినేషన్తో పాటు పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, హాస్టళ్లు వంటి వాటిలో ట్యాంకుల శుద్ధి సరైన విధంగా జరిగేలా సమన్వయ శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ.రామకృష్ణారావు, డీపీవో పి.లావణ్యకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, విద్య, వైద్యం, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News