ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో వచ్చే పత్తి పంటను కనీసం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్ ను అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్లో మహబూబాబాద్ జిల్లాలో 84 వేల 718 ఎకరాలలో పత్తి పంట సాగు జరిగిందని, 6 లక్షల 14 వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా ఉందని అన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి పంట కొనుగోలు చేసేందుకు 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధర రూ.8110/- ఉన్నదని. పత్తి రైతులు తమ పత్తిని తక్కువ ధరకు దళారులకు కానీ, మధ్యవర్తులకు కానీ, ఇతరులకు కానీ అమ్ముకోకుండా పత్తి ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉన్నప్పుడు సీసీఐ వారిచే మహబూబాబాద్ మార్కెట్ యార్డ్ పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లు, కేసముద్రం మూడు జిన్నింగ్ మిల్లులు, తొర్రూరు మార్కెట్ యార్డ్ రెండు జిన్నింగ్ మిల్లులు, మొత్తం 6 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.పత్తి రైతులు తమ పత్తిని తీసుకొని వచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పరిగణలోకి తీసుకొవాలని, నాణ్యమైన పత్తి పంటను వెంటనే కనీస మద్దతు ధర పై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి పంట కొనుగోలు నిమిత్తం జిన్నింగ్ మిల్లులో నీరు, టాయిలెట్ అవసరమైన పరికరాలు మొదలగు సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు పత్తి పంట తీసుకొని వచ్చే రైతులు తమ బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లీంక్ చేయాలని, దీనిపై రైతులలో అవసరమైన అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర కంటే తక్కువకు పత్తి పంట అమ్మవద్దని, మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మద్దతు ధర లభించని పక్షంలో నేరుగా జన్మింగ్ మిల్లులకు వచ్చి పత్తి పంట అమ్ముకోవాలని సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని అన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అగ్ని ప్రమాద నివారణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని సూచించారు. అలాగే *కప్పాస్ కిసాన్ యాప్* ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, అలాగే పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, అసిస్టెంట్ రవాణా శాఖ అధికారి సాయి చరణ్, మార్కెట్ కార్యదర్శులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ఓనర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .
Admin
E Nivas News