ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భారత సమాజంలో విద్య విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం, కన్నెపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాలను గడ్డం వంశీకృష్ణ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య, దళితుల హక్కులు, సామాజిక సమానత్వం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని, వారి ఆలోచన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, విద్యా అభివృద్ధే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. అలాగే కన్నెపల్లి ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాలే కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాలే కులం బీసీ–డీ (BC-D) జాబితాలో ఉండటంవల్ల ఉద్యోగాలు, రిజర్వేషన్లలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలే కులం ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే తరహాలో తెలంగాణలోనూ న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News