ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సాఫ్ట్ వేర్ లో ప్రభుత్వం కీలక మార్పులు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తరలించడం జరుగుతుందని, ప్రతి రైస్ మిల్లు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని తదనుగుణంగా ధాన్యం కేటాయించేలా ఆధునీకరించడం జరిగిందని, ఈ మార్పుతో రవాణా సమయం, కొనుగోలు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసిన తర్వాత గతంలో మాదిరిగా మాన్యువల్ ట్రక్ షీట్ ఉండదని, ఆన్ లైన్ లో మాత్రమే ట్రక్ షీట్ జనరేట్ చేయబడుతుందని, కొనుగోలు కేంద్రం, మిల్లుల టాకింగ్ ఆటోమేటిక్ గా అవుతుందని, ఆన్లైన్ లో జనరేట్ అయిన ట్రక్ షీట్ ను కొనుగోలు కేంద్రాల వారు ప్రింట్ తీసి ధాన్యపు లారీ వెంబడి మిల్లుకు పంపించాలని, ధాన్యం లారీ పక్కదారి పట్టకుండా జిపిఎస్ పరికరం బిగించబడి ఉంటుందని తెలిపారు. రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని, రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని, నాణ్యత అయితేనే రైతులకు గోనె సంచులు అందించాలని తెలిపారు. సంచులలో ధాన్యం నింపి కేంద్రం వద్ద తప్పనిసరిగా తూకం వేయాలని, రైతు ఆధార్ నిర్ధారణ ద్వారా ధాన్యం విక్రయాన్ని ధ్రువీకరించాలని, తూకం వేసిన ధాన్యాన్ని జిపిఎస్ కలిగిన ట్రక్కులలో లోడ్ చేయాలని తెలిపారు. ఓ పి ఎం ఎస్ ద్వారా ట్రక్ చిట్ జనరేట్ చేయాలని, మిల్లు కేటాయింపు పూర్తిగా ఆటోమేటిక్ గా జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించి ఓపియంఎస్ లో అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారని, మిల్లర్ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తుందని తెలిపారు. జిల్లాలోని రైతులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.
Admin
E Nivas News