ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం జరిగిందని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సేవల అత్యవసరతకు లోబడి ఆ రోజు కార్యాలయానికి ఆలస్యంగా హాజరు కావడం, కార్యాలయం నుండి త్వరగా వెళ్లడం, తక్కువ వ్యవధి గైర్హాజరు విధానాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. ఎన్నికల కోసం ఉపయోగించబోయే ప్రజా భవనాలు, విద్యా సంస్థల భవనాలు, ఇతర భవనాలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు , పోలింగ్ రోజుకు ముందు రోజు స్థానిక సెలవుగా పరిగణించబడుతుందని, దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాలకు ఈ నెల 10వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 11వ తేదీ (పోలింగ్ రోజు), బెల్లంపల్లి, భీమిని, కన్నేపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాలకు ఈ నెల 13వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 14వ తేదీ (పోలింగ్ రోజు), భీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి, మందమర్రి మండలాలకు ఈ నెల 16వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 17వ తేదీ (పోలింగ్ రోజు) లలో సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రకటించిన ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/సంస్థల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించబడిందని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న సంబంధిత అధికారులు, ప్రభుత్వ,ప్రైవేట్ వ్యాపార సంస్థలు, పరిశ్రమ యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పై పేర్కొన్న రోజులను వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని తెలిపారు.
Admin
E Nivas News