ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు గా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఘన సన్మానకార్యక్రమంనిర్వహిం చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో గెలుపొందిన బెల్లంపల్లి, నెన్నల్, తాండూర్, కాసిపేట్, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల నూతన సర్పంచ్లను బెల్లంపల్లి శాసనసభ్యుల గడ్డం వినోద్ శాలువాలు కప్పిఘనంగాసన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయంపాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్లకుసూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాల్సిన బాధ్యత సర్పంచ్లదేనన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, ఏడు మండలాల అధ్యక్షులు , ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News