ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్టాఫ్ గేట్ ఎదురుగా బుధవారం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన రిలే నిరహార దీక్షక సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలని, కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లాకు వస్తున్న ఇంచార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రులు పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రూ.100కోట్ల సబ్సిడీ బిల్లులు ప్రభుత్వం నుంచి తీసుకున్న యాజమాన్యం కార్మికులకు కనీసం వసతులు కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే రాష్ట్రాల వారిని తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం దారుణం అన్నారు. కార్మికుల ఐక్య పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్, నాయకులు సాయి చరణ్, మిల్లు కార్మికులు పాల్గొన్నారు.
Admin
E Nivas News