ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సి.ఎస్.) శశిధర్ రాజు తెలిపారు. 2024- 25 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లాలోని జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో గురువారం డిసిఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు అవకతవకలలో భాగస్వామ్యులైన రామారావు పేట గ్రామంలోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారి, 8 మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో 316 క్లాస్ 5, 318 క్లాస్ 4 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో 1 కోటి 39 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, జిల్లాలో 740 ఎకరాలలో 6 వేల 322.6 క్వింటాళ్ల ధాన్యమును 8 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి 1 కోటి 39 లక్షల రూపాయలు జమ చేసినట్లుగా ఆన్లైన్ ప్యాడి ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టం లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారని, వీటితో పాటు రవాణా ఖర్చుల కింద 1.90 లక్షల రూపాయల ట్రక్ చిట్టీలు సృష్టించి నమోదు చేశారని తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి. శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News