ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ సమావేశం నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. ఈ విషయంపై కోనేరు కోనప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. కోనేరు కోనప్ప శనివారం తన నివాసంలో మీడియా ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్సీ దండే విఠల్ మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు లేనప్పటికీ తప్పుడు పత్రాలు సృష్టించి ఓటరు జాబితాలో తన పేరు చేర్చించుకుని ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొని ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ నెల 16న జరగనున్న మున్సిపల్ సమావేశంలో ఇటీవల గెలిచిన కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ ఆఫిషియో సభ్యులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించే ప్రజా ప్రతినిధులకే ఎక్స్ ఆఫిషియో హోదా వర్తిస్తుంది. కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దండే విఠల్ పాల్గొనలేదని, ఓటు కూడా వేయలేదని, ఆ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్లో ఆయన పేరు లేదని కోనప్ప తెలిపారు. అదనంగా విడుదలైన చేర్పుల జాబితాలో కూడా పేరు లేదని పేర్కొన్నారు. గత 10–15 రోజులలో కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటర్ లిస్ట్లో దండే విఠల్ పేరు ఉన్నట్లు చూపించడం అనుమానాస్పదమని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, దండే విఠల్ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. ఈ వివాదం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Admin
E Nivas News