ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఎంతో మహిమాన్వితము కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి బుధవారం మంథనిలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భక్తులు ఘనంగా పూజ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి భక్తుల రాకతో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. *శ్రీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టత :* దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి గా పరిగణిస్తారు. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకా సురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేశారు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, అమిత బలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణము లేదని తెలిపారు. కావున మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరు జన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని అన్నారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతారు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతారు. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయములో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరు తేజస్సులు కలసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని నామాలతో పిలువసాగారు. కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడవుతారు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును *"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా* పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేశమంతటా దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజున *"శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"* వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినమున శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పిస్తారు. పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి రోజున మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదామ. సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తే పెళ్ళి కాని వారికి సంతానం లేని వారికి ఇది అమృత తుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది.
Admin
E Nivas News