ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో 3వ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామపంచాయతీలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న 3వ విడత నామినేషన్ ప్రక్రియ కొరకు చేసిన ఏర్పాట్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, సి.ఐ. లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ,ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోకూడదని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని, ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు.ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అవసరమైన సామాగ్రి జిల్లాలో అందుబాటులో ఉందని, అవసరం మేరకు వినియోగించుకోవాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. అనంతరం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో మద్దతు ధర ప్రకారం నగదు జమ చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో చేపట్టిన పట్టణ ఆరోగ్య కేంద్రం, అమృత్ 2.0, సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదనంతరం 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో చేపట్టిన ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదుల మరమ్మత్తు, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించి ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించడంతో పాటు సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను పాటించాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టిన భోజనశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News