ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. పసికందును గుండెలకు హత్తుకుని మురిసిపోకముందే మృత్యువు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో జరిగింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ కాలనీకి చెందిన ఆయిందాల రుచిత (23) గత వారం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మంగళవారం ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. రుచిత భర్త హరీష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి ఉన్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ఇటీవలే పుట్టిన పాపతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ సంతోషం వారం రోజులు కూడా నిలవకముందే రుచిత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి ప్రేమకు దూరమైన నవజాత శిశువు, అమ్మ కోసం ఎదురు చూస్తున్న నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటనతో శాంతినగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Admin
E Nivas News