ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ పాఠశాలలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో పాటు జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎంపీ పాఠశాలకి రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, ఫుట్బాల్ ఆడేవాడిని. క్రీడలు జీవితం లో ఒక భాగం. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి” అని తెలిపారు. అలాగే గెలుపు–ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించే మనస్తత్వం క్రీడల ద్వారా వస్తుందని, టీమ్ స్పిరిట్ అలవడుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని, క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడడంతో నిజ జీవితంలో వచ్చే ఆటుపోట్లు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని ఎంపీ అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవన భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ హరికృష్ణ , డీసీసీ మాజీ సెక్రటరీ నల్ల రవి తదితర నాయకులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలను ఎంపీ తిలకించి, విజేతలైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది.
Admin
E Nivas News