ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణం పాత మంచిర్యాల ప్రాంతానికి చెందిన అల్లి లచ్చయ్య తనకు వేంపల్లి శివారులో గల పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను మరొక చోటికి మార్చాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రౌతు అనిల్ తమ గ్రామంలో దాదాపు 800 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి ధాన్యం సాగు చేస్తున్నామని, తాము ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ నగర్ కాలనీవాసులు తమ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న భవన నిర్మాణం పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తన దరఖాస్తులో 2021- 25 విద్యా సంవత్సరాలలో జరిగిన బి ఏ ఎస్ లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితా పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రతినిధి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తన దరఖాస్తులో స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లాలో రిజర్వేషన్ ప్రకారం బి.సి. లకు స్థానాలను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News