ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భారతదేశ చరిత్రలో అణగారిన వర్గాల విముక్తి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్. ఆయన జీవితం అన్యాయంపై తిరుగుబాటు, జ్ఞానం ద్వారా మార్పు, సమానత్వం కోసం నిబద్ధత అనే మూడు ప్రధాన సూత్రాల చుట్టూ తిరిగింది.స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే విలువలను భారత సమాజంలో స్థాపించడానికి ఆయన చేసిన కృషి అపారమైనది. *జననం – బాల్యంలోని కష్టాలు* డాక్టర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రదేశంలో జన్మించారు. తక్కువ కులానికి చెందిన కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచే కుల వివక్షను తీవ్రంగా అనుభవించారు. పాఠశాలలో ఆయనను ఇతర విద్యార్థుల నుంచి వేరు కూర్చోబెట్టడం, నీళ్లు తాగేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం వంటి అన్యాయాలు ఆయన మనసులో గాఢమైన ముద్ర వేశాయి. ఈ అనుభవాలే ఆయనను సమాజ సంస్కరణ దిశగా నడిపించాయి. *విద్యాభ్యాసం – జ్ఞానమే ఆయుధం* అంబేద్కర్ విద్యనే విముక్తి సాధనంగా భావించారు. కఠోర శ్రమతో ఉన్నత విద్యను సాధించి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం,ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్య పొందారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్' లో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. ఈ విద్య ఆయనకు విశాల దృక్పథాన్ని అందించి, భారత సమాజ సమస్యలను లోతుగా అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది. *కులవ్యవస్థపై పోరాటం* అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న కులవ్యవస్థను మానవత్వానికి విరుద్ధమైనదిగా పేర్కొన్నారు. 'అస్పృశ్యత' అనే దురాచారాన్ని నిర్మూలించడానికి ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యంగా 'మహాడ్ చౌదర్ ట్యాంక్' ఉద్యమం ద్వారా అణగారిన వర్గాలకు నీటి హక్కు సాధించారు.ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రసిద్ధ నినాదం "విద్య పొందండి, పోరాడండి, సంఘటితమవండి" అంటారు. *రాజకీయ జీవితం – హక్కుల సాధన* అంబేద్కర్ గారు కేవలం సామాజిక సంస్కర్త మాత్రమే కాదు, గొప్ప రాజకీయ నాయకుడు కూడా. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన ప్రత్యేక ప్రతినిధిత్వాన్ని కోరారు. 'పూన ఫాక్ట్' ద్వారా ఆయన దళితులకు రాజకీయ హక్కులు సాధించారు. ఆయన ఆలోచనలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది వేశాయి. *రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్* భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత,దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత అంబేద్కర్ గారిపై పడింది.ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన "భారత రాజ్యాంగం" ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచింది. ఈ రాజ్యాంగం ద్వారా సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, మౌలిక హక్కులు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు వంటి ముఖ్య అంశాలు అమలులోకి వచ్చాయి. *మహిళల,కార్మికుల సంక్షేమం* అంబేద్కర్ గారు మహిళల హక్కులకు పెద్దపీట వేశారు. 'హిందూ కోడ్ బిల్' ద్వారా మహిళలకు ఆస్తి హక్కులు, వివాహంలో సమాన హక్కులు కల్పించాలని ప్రయత్నించారు. కార్మికుల కోసం కనీస వేతనాలు,పని గంటలు తగ్గింపు వంటి సంస్కరణలు చేపట్టారు. ఆయన దృష్టిలో సమాజ అభివృద్ధి అంటే ప్రతి వర్గం అభివృద్ధి చెందడం. *ఆర్థిక,సామాజిక ఆలోచనలు* అంబేద్కర్ గారు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త కూడా. ఆయన భారతదేశ అభివృద్ధికి పరిశ్రమలు, నీటి వనరుల వినియోగం, సమాన ఆర్థిక పంపిణీ అవసరమని భావించారు. సామాజిక న్యాయం లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. *బౌద్ధ ధర్మ స్వీకారం* జీవితాంతంలో అంబేద్కర్ 1956లో 'బుద్ధిజం'ను స్వీకరించారు. హిందూ కులవ్యవస్థలోని అసమానతలపై నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధమతం ద్వారా సమానత్వం, శాంతి, మానవత్వం అనే విలువలను ప్రజల్లో ప్రోత్సహించారు. *రచనలు --సిద్ధాంతాలు* అంబేద్కర్ అనేక గ్రంథాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి. "అన్నీహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ థి బుద్ధ అండ్ హిస్ దమ్మ" ఈ రచనల ద్వారా ఆయన సమాజంలోని అసమానతలను విమర్శిస్తూ మార్పు కోసం మార్గం చూపించారు. *వారసత్వం – నేటి ప్రభావం* డా. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ భారతదేశంలో సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయన జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఆయనను "భారత రాజ్యాంగ పితామహుడు"గా గౌరవిస్తారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు కాదు. ఒక ఉద్యమం, ఒక సిద్ధాంతం, ఒక ప్రేరణ. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే విలువలను ఆయన జీవితాంతం ఆచరించి చూపించారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే సమానత్వభరితమైన సమాజాన్ని నిర్మించగలం. "జ్ఞానం ద్వారా విముక్తి, సమానత్వం ద్వారా సమాజ నిర్మాణం" ఇదే అంబేద్కర్ గారి శాశ్వత సందేశం. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News