ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ లతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు చెత్త సేకరణ, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామంలోని చెరువును మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. చెరువు పరిస్థితి, నీటి నిల్వలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోనివెంకట్రావుపేట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమ ఇండ్లను నిర్ణీత విస్తీర్ణంలో త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ, ఓ.పి., ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోసంబంధితఅధికారులుతదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News